కేజీఎఫ్తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన యశ్.. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నారా? ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘టాక్సిక్ – ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో యశ్ పూర్తిగా కొత్త లుక్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, ప్రమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
అయితే మరోవైపు ఈ సినిమా ప్రచార కంటెంట్పై మిశ్రమ స్పందన కూడా వ్యక్తమవుతోంది. కొందరు విజువల్స్, మేకింగ్ను ప్రశంసిస్తుంటే.. మరికొందరు సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం చివరకు ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్లో కూడా విడుదలకు సిద్ధమైంది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు అందరి దృష్టి యశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్పైనే పడింది. ‘టాక్సిక్’ తర్వాత ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నారు? ఎలాంటి కథను ఎంచుకున్నారు? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
తాజాగా ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘సప్తసాగరదాచే ఎల్లో’ సినిమాతో దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న హేమంత్ ఎం రావుతో యశ్ చేతులు కలపనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఓ ఆర్మీ జవాన్ తర్వాత పోలీస్ ఆఫీసర్గా మారే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకున్న పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ప్రాజెక్ట్లో యశ్ కేవలం హీరోగానే కాకుండా కథ రూపకల్పనలో కూడా కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు కరణ్ జోహార్, హిరూ జోహార్, అపూర్వ మెహతా ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశముందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం దర్శకుడు హేమంత్ ఎం రావు ‘666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. దీంతో యశ్తో సినిమా వార్తల్లో ఎంత నిజం ఉందన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.









