వాలంటైన్స్ వీక్ (Valentine Week 2026) సందర్భంగా సినీ ప్రేమికులకు టాలీవుడ్ అదిరిపోయే కానుకను అందించబోతోంది. దివంగత నటుడు ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా నటించిన ఆల్టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘మనసంతా నువ్వే’ తిరిగి థియేటర్లలో విడుదల కానుంది. దాదాపు 25 ఏళ్ల క్రితం విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ చిత్రం, ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఫీల్ గుడ్ మూవీని ఎం.ఎస్. రాజు నిర్మించగా, వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం టాలీవుడ్లో కొనసాగుతున్న రీ-రిలీజ్ ట్రెండ్లో భాగంగా, ఈ చిత్రాన్ని ప్రైమ్ షో నిరంజన్ రెడ్డి, రఘురామ్ రెడ్డి మరికొందరు నిర్మాతలు కలిసి మళ్లీ విడుదల చేస్తున్నారు. అప్పట్లో 250 రోజులకు పైగా ప్రదర్శితమై రికార్డులు సృష్టించిన ఈ సినిమాలోని పాటలు, ఎమోషన్స్ ఇప్పటికీ ఎవర్గ్రీన్. ఈ తరం యువతను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందని, థియేటర్లలో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి వాలంటైన్స్ డే వారం థియేటర్లలో అసలైన ‘మూవీ ఫెస్టివల్’ను తలపించబోతోంది. కేవలం ‘మనసంతా నువ్వే’ మాత్రమే కాకుండా, మొత్తం ఐదు ప్రేమ కథా చిత్రాలు ఈ వారంలో రీ-రిలీజ్ కాబోతుండటం విశేషం. దీంతో థియేటర్లు ప్రేమికులతో సందడిగా మారనున్నాయి. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, పెద్ద తెరపై తమకు ఇష్టమైన ప్రేమ కథలను చూసేందుకు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








