నటుడు శివాజీ, సీనియర్ నటి లయ కాంబినేషన్లో సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ కామెడీ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఈటీవీ విన్’లో ఈ నెల 12 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సినిమా ప్రచారంలో భాగంగా చిత్రబృందం తాజాగా విడుదల చేసిన ‘పాయా పాయా’ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ఈ పాటలో ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. పవన్ కల్యాణ్ అంటే బండ్లకు ఉన్న విపరీతమైన భక్తిని ఈ పాటలో మరోసారి చాటుకున్నారు. గతంలో బండ్ల గణేశ్ నోట వైరల్ అయిన “ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా” అనే డైలాగ్ను ఈ పాటలో రీమిక్స్ చేయడం విశేషం. పవన్ మేనరిజాన్ని అనుకరిస్తూ బండ్ల వేసిన స్టెప్పులు, ఆయన ఎనర్జీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలో బండ్లతో పాటు అలీ, బబ్లూ, భోలే శావలి కూడా సందడి చేశారు.
పాట సాహిత్యంలో పవన్ కల్యాణ్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావన కూడా తీసుకురావడం చర్చనీయాంశమైంది. “పవన్ కల్యాణ్ అన్న కూడా హైదరాబాద్ సే పాయా మంగాయా… హిట్ల మీద హిట్లతో పవర్ స్టార్ బన్ గయా” అంటూ సాగే లైన్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పాటపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ, బండ్ల గణేశ్ ఎనర్జీ మాత్రం సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రైమ్ కామెడీ డ్రామా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.









