అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన క్లాసిక్ రొమాంటిక్ డ్రామా ‘లవ్ స్టోరీ’ మరోసారి వెండితెరపై అలరించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని గ్రాండ్గా రీ-రిలీజ్ చేస్తున్నట్లు హీరో నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. 2021లో కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లకు పూర్వ వైభవం తీసుకొచ్చిన ఈ సినిమా, ఇప్పుడు రీ-రిలీజ్ ట్రెండ్లో భాగంగా సినీ ప్రేక్షకులను పలకరించనుంది.
దర్శకుడు శేఖర్ కమ్ముల అత్యంత సున్నితంగా తెరకెక్కించిన ఈ చిత్రం తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. కుల, వర్గ భేదాల చుట్టూ అల్లుకున్న ప్రేమకథతో పాటు సున్నితమైన సామాజిక అంశాలను ఈ సినిమాలో చర్చించారు. నాగచైతన్య డ్యాన్సర్గా తన నటనతో మెప్పించగా, సాయి పల్లవి తనదైన శైలిలో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అప్పట్లో తక్కువ టికెట్ ధరలు, పరిమిత ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.
ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే చార్ట్బస్టర్స్గా నిలిచాయి. ముఖ్యంగా ‘సారంగ దరియా’, ‘నీ చిత్రమ్ చూసి’ వంటి సాంగ్స్ యూట్యూబ్లో రికార్డులు సృష్టించాయి. ఈ ఆల్-టైమ్ క్లాసిక్ మూవీని బిగ్ స్క్రీన్పై మళ్లీ చూడాలని ఆశిస్తున్న అభిమానులు చైతన్య ప్రకటనతో ఖుషీ అవుతున్నారు. ప్రేమికుల రోజున ఈ మ్యాజికల్ బ్లాక్బస్టర్ను థియేటర్లలో సెలబ్రేట్ చేసుకోవడానికి సినీ ప్రియులు సిద్ధమవుతున్నారు.









