మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాపై జరుగుతున్న వ్యవస్థీకృత నెగెటివ్ ప్రచారాన్ని అడ్డుకుంటూ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టికెటింగ్ ప్లాట్ఫామ్లు మరియు సోషల్ మీడియాలో సినిమాపై దురుద్దేశపూర్వక రేటింగ్లు, తప్పుడు సమీక్షలను నిరోధించాలని కోర్టు ఆదేశించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న నేపథ్యంలో, ఈ తీర్పు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ పరిణామంపై యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ తన ఆవేదనను పంచుకున్నారు. ఈ వార్త వినగానే తనకు కొంత సంతోషం, కొంత బాధ కలిగిందని ఆయన పేర్కొన్నారు. ఎంతోమంది కష్టం మరియు కోట్లాది రూపాయల పెట్టుబడితో ముడిపడి ఉన్న సినిమా రంగాన్ని ఇలాంటి ఆర్గనైజ్డ్ దాడుల నుండి రక్షించడం సంతోషకరమని, అయితే మన పరిశ్రమలోని వ్యక్తులే ఇలాంటి కుట్రలకు పాల్పడటం బాధాకరమని విజయ్ తన పోస్ట్లో రాసుకొచ్చారు.
ముఖ్యంగా తన ‘డియర్ కామ్రేడ్’ సినిమా విడుదల సమయం నుంచే తాను ఇలాంటి లక్షిత దాడులను ఎదుర్కొంటున్నానని విజయ్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తన ఆవేదన ఎవరికీ వినిపించలేదని, ఇప్పుడు మెగాస్టార్ అంతటి గొప్ప నటుడి సినిమాకే ఈ పరిస్థితి రావడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఈ సమస్యను కోర్టు గుర్తించడం మంచి పరిణామమని పేర్కొంటూ, సంక్రాంతి బరిలో ఉన్న చిరంజీవి సినిమాతో పాటు అన్ని చిత్రాలు ఘనవిజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.









