ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రాల టికెట్ రేట్ల పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టు సానుకూల నిర్ణయం తీసుకుంది. టికెట్ రేట్ల పెంపుపై నిర్మాతలు పెట్టుకున్న వినతిని పరిశీలించి, తక్షణమే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శిని డివిజన్ బెంచ్ ఆదేశించింది. దీనివల్ల ఈ భారీ చిత్రాల నిర్మాతలకు పెద్ద ఎత్తున ఊరట లభించినట్లైంది.
గతంలో టికెట్ రేట్ల పెంపును నిరాకరిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కేవలం ‘పుష్ప-2’, ‘గేమ్ ఛేంజర్’ వంటి చిత్రాలకు మాత్రమే పరిమితమని, అది ఈ సంక్రాంతి సినిమాలకు వర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ స్పష్టతతో జనవరి 9న విడుదలవుతున్న ‘ది రాజాసాబ్’, జనవరి 12న విడుదలవుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రాలకు ప్రత్యేక షోలు మరియు రేట్ల పెంపుదలపై ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
మారుతి దర్శకత్వంలో రూపొందిన ప్రభాస్ సినిమా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి సినిమా రెండూ కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కిన నేపథ్యంలో.. ఈ కోర్టు ఆదేశాలు చిత్ర పరిశ్రమకు పెద్ద బూస్ట్గా మారాయి. పండుగ సీజన్ కావడంతో ప్రేక్షకుల రద్దీకి అనుగుణంగా ధరల నిర్ణయం జరిగితే, కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమాలకు మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.









