కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’తో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించిన రష్మిక మందన్న, నేటితో సినీ పరిశ్రమలో విజయవంతంగా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆమె ఇప్పటివరకు 26 సినిమాల్లో నటించి, పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఈ మైలురాయిని పురస్కరించుకుని ఇన్స్టాగ్రామ్ వేదికగా రష్మిక స్పందిస్తూ.. తన కెరీర్లో సాధించిన విజయాల కంటే, తనను సొంత మనిషిలా ఆదరిస్తున్న అభిమానులనే (ఫ్యామిలీ) తాను గర్వపడే అతిపెద్ద ఆస్తిగా అభివర్ణించారు.
తొమ్మిదేళ్ల కాలం ఇంత త్వరగా గడిచిపోతుందనే విషయాన్ని తాను నమ్మలేకపోతున్నానని రష్మిక ఆవేదనతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన ప్రతి విజయంలోనూ, ఓటమిలోనూ, సందేహాల్లోనూ తనకు తోడుగా నిలిచిన ప్రేక్షకులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల ప్రేమ, ఓర్పు వల్లే తాను ఇండస్ట్రీలో ఇంతకాలం నెట్టుకురాగలిగానని, వారి మెసేజ్లు చదువుతుంటే తన గుండె నిండిపోతోందని ఆమె పేర్కొన్నారు.
నటి-ప్రేక్షకుడు అనే బంధం దాటి, తమ మధ్య ఉన్నది కుటుంబ బంధమని రష్మిక ఉద్ఘాటించారు. భవిష్యత్తులోనూ మరింత కష్టపడి మంచి సినిమాలు చేస్తానని, అభిమానులు గర్వపడేలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తానని ఆమె మాటిచ్చారు. “మీరు నన్ను ఎలా ఉన్నానో అలా అంగీకరించి ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతలు.. ఎప్పటికీ మీ రష్మిక” అంటూ తన ఎమోషనల్ నోట్ను ముగించారు.









