మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSVPG) సినిమా సంక్రాంతి బరిలో నిలిచేందుకు సిద్ధమైంది. జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి తాజాగా మూడో సింగిల్ ‘ఏంటి బాసూ సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి’ అనే మాస్ సాంగ్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటలో చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేశ్ కూడా స్టెప్పులేయడం అభిమానులను ఖుషీ చేస్తోంది. మాస్ బీట్తో సాగే ఈ సంక్రాంతి స్పెషల్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ పాట విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో అనిల్ రావిపూడి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే బాలకృష్ణ, వెంకటేశ్, చిరంజీవి వంటి ముగ్గురు సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన అనిల్, త్వరలో అక్కినేని నాగార్జునతో కూడా సినిమా చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. “నాగార్జున గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఆయనతో కూడా తప్పకుండా సినిమా ఉంటుంది” అని అనిల్ ప్రకటించారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలిస్తే, ఈ తరం దర్శకుల్లో నలుగురు సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన అరుదైన రికార్డు అనిల్ రావిపూడి ఖాతాలో చేరుతుంది.
ఇక సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ.. చిరంజీవి గారి అసలు పేరు ‘శివ శంకర వరప్రసాద్’ అని, ఆయన ఇమేజ్కు, వ్యక్తిత్వానికి గౌరవంగా ఉంటుందని ఈ పేరు పెట్టినట్లు అనిల్ వెల్లడించారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ కీలకమైన అతిథి పాత్రలో కనిపిస్తున్నారు. రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి, ఈ సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.









