నటుడు శివాజీ ఒక బహిరంగ వేదికపై హీరోయిన్ల డ్రెస్సింగ్ను ఉద్దేశించి చేసిన ‘సామాన్లు’, ‘దరిద్రపు ముం**’ వంటి పదజాలంపై ప్రకాష్ రాజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “ఆడవాళ్లంటే మీ ఉద్దేశ్యం ఏంటి? ఆ అహంకారం ఎక్కడిది?” అని శివాజీని నిలదీశారు. మహిళల శరీర భాగాలపై కామెంట్స్ చేయడం సంస్కారం అనిపించుకోదని, వేదికపై మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరూ సంస్కారంతో ప్రవర్తించాలని హితవు పలికారు. తరతరాలుగా మహిళలకు మగవారి నుంచే అన్యాయం జరుగుతోందని, ఇప్పుడు వారి వ్యక్తిగత స్వేచ్ఛను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు.
నటి అనసూయ భరద్వాజ్కు ప్రకాష్ రాజ్ పూర్తి మద్దతు ప్రకటించారు. అనసూయను ‘ఆంటీ’ అంటూ ట్రోల్ చేయడం, ఆమె వస్త్రధారణను తప్పుబట్టడం వంటి చర్యలను ఆయన ఖండించారు. “అనసూయ, నువ్వు ధైర్యంగా నిలబడు.. నీ వెనుక మేమున్నాం” అని భరోసా ఇచ్చారు. కొందరు వ్యక్తులు తమ బుద్ధిని మార్చుకోకుండా మహిళల దుస్తులను తప్పుబట్టడం వారి నీచ మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. మగవాళ్ళే గిల్లి మళ్ళీ ఆడవాళ్ళనే తప్పుబట్టే ధోరణి ‘పోకిరి’ సినిమా విలన్ల ఆలోచనా విధానంలా ఉందని ఎద్దేవా చేశారు.
ఈ వివాదంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా అనసూయకు మద్దతుగా నిలిచారు. మహిళలు ఏ దుస్తులు ధరించాలి, ఎలా ఉండాలి అనేది వారి వ్యక్తిగత ఇష్టమని, దానిపై తీర్పులు చెప్పే అధికారం సమాజంలో ఎవరికీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల ప్రవర్తనపై కామెంట్స్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని నాగబాబు పేర్కొన్నారు. శివాజీ సారీ చెప్పినప్పటికీ, మహిళా లోకాన్ని కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలను సినీ ప్రముఖులు, నెటిజన్లు ఇప్పటికీ తప్పుబడుతూనే ఉన్నారు.









