హీరోయిన్ల వస్త్రధారణపై తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో నటుడు శివాజీ స్పందించారు. ఈ వివాదంపై విచారం వ్యక్తం చేస్తూ ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తాను మాట్లాడిన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు.
శివాజీ వివరణలోని ముఖ్యాంశాలు:
-
వాడకూడని పదాలు: “హీరోయిన్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నాలుగు మంచి మాటలు చెప్పాలనుకున్నాను. కానీ ఆ క్రమంలో రెండు ‘అన్ పార్లమెంటరీ’ (వాడకూడని) పదాలు దొర్లాయి. ఆ రెండు పదాలు వాడి ఉండకూడదు, దానికి సారీ చెబుతున్నాను.”
-
ఉద్దేశం ఇదే: “నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్లు బయటకు వెళ్లినప్పుడు వారి దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉంటే వారికి ఇబ్బంది ఉండదనేది నా ఆలోచన. అంతే తప్ప ఎవరినీ అవమానించాలని కాదు.”
-
మహిళల పట్ల గౌరవం: “నేను ఎప్పుడూ స్త్రీని అమ్మవారిలాగే భావిస్తాను. సమాజంలో మహిళలను తక్కువ చేసి చూసే వారికి అవకాశం ఇవ్వొద్దనే ఆవేదనతో ఆ మాటలు అన్నాను. నా ఉద్దేశం మంచిదే కానీ, వాడిన భాష తప్పు.”
-
భాషపై క్లారిటీ: “ఒక ఊరి యాసలో ఫ్లోలో ఆ మాటలు వచ్చాయి. మహిళలు ఎవరైనా నా వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే క్షమించండి” అని ఆయన కోరారు.
శివాజీ తన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే అని వివరించినప్పటికీ, అనసూయ వంటి నటీమణులు మాత్రం ఆయన క్షమాపణలు చెప్పే విధానాన్ని కూడా తప్పుపడుతూ సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఈ వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు.









