టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 1న కోయంబత్తూరులో డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆమె పెళ్లిపై కొందరు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటంతో, నటి మరియు బీజేపీ నాయకురాలు మాధవీలత ఘాటుగా స్పందించారు.
సమంత వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్న వారికి మాధవీలత గట్టి కౌంటర్ ఇస్తూ ఒక వీడియో విడుదల చేశారు. “సమంత పెళ్లి చేసుకుంటే కొందరికి ఎందుకంత బాధ? ఆమె ఎవరిదో సంసారాన్ని కూల్చినట్లు మాట్లాడుతున్నారు. ఇలాంటి కామెంట్లు చేసేవారు ముందు తమ సంబంధాల గురించి ఆలోచించుకోవాలి,” అని మాధవీలత హితవు పలికారు. “ఒకరి పెళ్లి చెడగొట్టి పెళ్లి చేసుకున్నవాళ్లు, విడాకులు ఇవ్వకుండా సంబంధాలు నడిపేవాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నవ్వొస్తోంది. మీరేమీ పతివ్రతలు కాదు కదా?” అంటూ విమర్శకులను సూటిగా ప్రశ్నించారు.
మాధవీలత తన వ్యాఖ్యలలో, పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయని, రుణాలు తీరిపోతే విడిపోతారని అభిప్రాయపడ్డారు. “ఒకరినొకరు చంపుకోవడం లేదు కదా? ఆ విషయంలో సంతోషించండి,” అని ఆమె అన్నారు. సమంతపై అనవసరంగా విమర్శలు చేయడం, ఆమె వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేయడం తగదని స్పష్టం చేస్తూ, విమర్శకులకు గట్టి సందేశాన్ని అందించారు.








