తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు అభినయ్ కింగర్ ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ, చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో కోలీవుడ్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ‘అరుముగ్’, ‘ఆరోహణం’, ‘సక్సెస్’ వంటి పలు చిత్రాల్లో నటించి అభినయ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
అభినయ్ కింగర్ చివరిసారిగా ‘వల్లవనుక్కు పుల్లుం ఆయుధం’ అనే చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో ఆయన నటనకు పూర్తిగా దూరమై చికిత్స తీసుకుంటున్నారు. ఆయన సుదీర్ఘకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతూ, చివరికి చికిత్స ఫలించకపోవడంతో మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాక, తన మరణాన్ని ముందే ఊహించినట్లుగా అభినయ్ కింగర్ మూడు నెలల క్రితం ఒక వీడియోను విడుదల చేశారు. అందులో వైద్యులు తాను కేవలం ఏడాదిన్నర మాత్రమే జీవించగలనని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో విడుదలైన కొద్ది కాలానికే ఆయన మరణించడం సినీ వర్గాలను, అభిమానులను మరింతగా కలచివేస్తోంది.









