మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కింగ్ అక్కినేని నాగార్జున, అమల దంపతులు, విక్టరీ వెంకటేష్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు హీరోయిన్ నయనతార కూడా ఈ సంబరాల్లో సందడి చేసింది. చిరంజీవి తన ఆప్త మిత్రులతో కలిసి పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు. ఈ స్టార్ హీరోల మధ్య ఉన్న బలమైన స్నేహబంధం, వారి కుటుంబాలతో కలిసి పండుగ చేసుకోవడం సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. “నా ప్రియమైన స్నేహితులు నాగార్జున, వెంకటేష్.. నా కోస్టార్ నయనతార మా ఫ్యామిలీతో కలిసి దీపావళి పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయి. జీవితాన్ని ప్రకాశవంతంగా చేసే ప్రేమ, చిరు నవ్వులు, ఐక్యతను గుర్తు చేస్తాయి” అని చిరంజీవి పేర్కొన్నారు.
చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ దంపతులు కలిసి ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలోని ఈ అగ్ర హీరోలు తమ వృత్తిపరమైన బంధాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ సన్నిహితంగా ఉండటం, ఇలాంటి పండుగ వేడుకలను కలిసి జరుపుకోవడం అభిమానులకు ఆనందాన్ని పంచుతోంది.









