సమాజంలో అన్యాయాలపై నిర్భయ స్వరం చిన్మయి
ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద, తెలుగు మరియు తమిళ భాషల్లో గాయకురాలిగా గుర్తింపు పొందారు. ఆమె కేవలం గాయనిగా మాత్రమే కాకుండా, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై తన అభిప్రాయాన్ని నిర్భయంగా వెల్లడించే వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మీటూ ఉద్యమం సమయంలో సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై మొదటగా గళమెత్తిన మహిళల్లో చిన్మయి ఒకరు. ఆ సమయంలో తమిళ సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులపై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
సోషల్ మీడియా వేధింపులపై చిన్మయి ఆగ్రహం
రీసెంట్ డేస్లో ట్విట్టర్ (ఎక్స్) వాడకం పెరిగిన నేపథ్యంలో, కొందరు ఆకతాయిలు గ్రూప్గా ఏర్పడి చిన్మయిపై పచ్చి బూతులు మాట్లాడుతూ, పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారని, ఆడపిల్లల గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని సమాచారం. దీనిపై చిన్మయి తీవ్రంగా స్పందించారు. తనను, తన పిల్లలను ఉద్దేశించి “నా పిల్లలు చనిపోవాలని చెబుతున్నారు” అంటూ చేసిన వేధింపులను తట్టుకోలేక, ఆ ట్రోలర్స్ అకౌంట్స్ను ట్యాగ్ చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ను ట్యాగ్ చేసి యాక్షన్ తీసుకోవాలని కోరారు.
సజ్జనార్ను కోరిన చిన్మయి, పోలీసుల విచారణ
గౌరవనీయులైన సజ్జనార్ (VC Sajjanar) సర్ను ట్యాగ్ చేస్తూ, “దయచేసి దీన్ని గమనించండి. నేను ఈ రోజువారీ వేధింపులతో విసిగిపోయాను. తెలంగాణలో మహిళలు మెరుగైన అర్హత కలిగి ఉన్నారు… ఈ కేసు 15 సంవత్సరాలు పట్టినా చట్టం తన పని తాను చేసుకోనివ్వండి. దయచేసి సహాయం చేయండి” అంటూ చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిన్మయి ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, ట్రోలర్లు ఇప్పటికే తమ అకౌంట్లను డీయాక్టివేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.








