ఏపీలో మహిళలు, చిన్నారులపై పెరుగుతున్న అఘాయిత్యాల విషయంలో కూటమి ప్రభుత్వం తీవ్ర విమర్శల ఎదుర్కొంటోంది. ముఖ్యంగా వైసీపీ హయాంలో తీసుకొచ్చిన దిశా యాప్ ను నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం స్పందించింది. వైసీపీ విమర్శలపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత ఘాటు కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ పాలనలో NCRB నివేదిక ప్రకారం మహిళలు, చిన్నారుల మీద 2,04,418 నేరాలు నమోదయ్యాయని, ఐదేళ్లపాటు జరిగిన నేరాలలో ఒక్క సంఘటనపై మాట్లాడని వ్యక్తి ఇప్పుడు శవ రాజకీయం కోసం ప్రాకులాడడానికి సిగ్గు పడాలన్నారు. 21 రోజుల్లో శిక్ష అంటూ చట్ట బద్ధత లేని దిశా చట్టంతో హడావిడి చేసి 2018 లో టీడీపీ ప్రభుత్వం పెట్టిన ఫోర్త్ లయన్ యాప్ పేరు మర్చి దిశా యాప్ అని చెప్పి మగవాళ్లతో కూడా డౌన్ లోడ్ చేయించారని మండిపడ్డారు.
దిశా యాప్ లేకపోవటం వల్లనే నేరాలు అని అబద్దపు ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి కౌంటర్ ఇచ్చారు. మరి మీ హయాంలో దిశా యాప్ ఉన్నప్పుడు అన్ని అఘాయిత్యాలు ఎలా జరిగాయని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆడబిడ్డల మీద ఏ చిన్న సంఘటన జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఎస్పీ తో మాట్లాడి చర్యలకు ఆదేశిస్తున్నారని , ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ చేపట్టి త్వరితగతిన నేరస్థులకు శిక్ష పడేలా చేయదానికి హైకోర్ట్ ని కోరుతున్నారని చెప్పారు.








