నిబంధనలు ఉల్లంఘించి వైసీపీ కార్యాలయాలు నిర్మిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం చర్యలకు దిగడం తెలిసిందే. అయితే, తమ కార్యాలయాలను ప్రభుత్వం కూల్చివేస్తుండడం పట్ల వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ నేపథ్యంలో, వైసీపీ కార్యాలయాల కూల్చివేత పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా… రాజకీయ కక్షతోనే ప్రతిపక్ష కార్యాలయాలను కూల్చివేస్తున్నారని వైసీపీ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టామని స్పష్టం చేశారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ… అనుమతులు లేకుండా భవనాలు నిర్మించారని తెలిపారు. చట్ట ప్రకారమే చర్యలు చేపట్టామని కోర్టుకు వివరించారు.
వాదనలు విన్న హైకోర్టు… తీర్పును రిజర్వ్ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 16 వైసీపీ కార్యాలయాలపై స్టేటస్ కో కొనసాగుతుందని స్పష్టం చేసింది.








