తెలంగాణ రాజకీయాల్లో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా లగచర్లలో చోటు చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. కలెక్టర్ తో పాటుగా అధికారుల పై దాడి అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పోలీసులు ఉన్నతాధికారులు స్వయంగా ఈ ఘటన పైన విచారణ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేసారు. అయితే, రిమాండ్ రిపోర్టులో ఈ ఘటన వెనుక ఉన్న ఆసక్తి కర అంశాలు వెలుగు లోకి వచ్చాయి.
రిమాండ్ రిపోర్ట్ లో
వికారాబాద్ కలెక్టర్ పైన దాడి అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో అనేక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రిమాండ్ రిపోర్టులో ఈ ఘటన పూర్తిగా ప్లాన్ ప్రకారం చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 46 మందిని నిందితులుగా చేర్చారు. ఏ1గా మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి అనుచరుడిగా చెబుతున్న సురేశ్ ను చేర్చారు. దాడి చేసిన వారిని గుర్తించి వారి పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. వారిలో ఇప్పటికే 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ప్లాన్ ప్రకారమే దాడి
ప్రధాన నిందితుడు సురేష్తో పాటు మరో 29 మంది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల అభ్యర్ధన మేరకు కలెక్టర్ గ్రామానికి వెళ్లారని సమాచారం. రైతులతో పాటుగా స్థానికుల అభిప్రాయం కోసం గ్రామానికి వెళ్లగా అక్కడ ఉద్దేశ పూర్వకంగానే దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. అభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ తో పాటుగా రెవిన్యూ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. అక్కడ రైతులతో మాట్లాడే ప్రయత్నం జరుగుతుండగానే ఒక్కసారిగా కొందరు స్థానికులు వచ్చి మెరుపు దాడి చేసారు. రాళ్ల, కర్రలతో అధికారుల కార్లు వెంబడించారు. కలెక్టర్ వాహనాన్ని అడ్డుకొని నినాదాలు చేయటంతో పాటుగా ఆయన కారును ధ్వంసం చేసారు.
నరేంద్ర రెడ్డి అరెస్ట్ తో
పలువురు అధికారుల పై కారంపొడి విసిరారు. దాడి చేస్తున్న సమయంలో అధికారులు స్థానికంగా ఉన్న పాఠశాలలో తల దాచుకున్నారు. అక్కడకు కొందరు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురు అధికారులు, పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం కారణమైన వారిని వదిలేది లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే ప్రధాన నిందితుడుగా భావిస్తున్న సురేశ్ తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి 42 సార్లు ఫోన్ చేసినట్లు గుర్తించారు. దీంతో, ఈ ఉదయం హైదరాబాద్ లో పట్నం నరేంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. నరేంద్ర రెడ్డి అరెస్ట్ పైన కేటీఆర్ మండిపడ్డారు. ఈ ఘటన ఇప్పుడు కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ గా మారింది.









