దేశంలోని రైతులందరికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణసదుపాయాన్ని పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైతులు ఎలాంటి తనఖా లేకుండా రూ. 1.6 లక్షల వరకే రుణం తీసుకునే అవకాశం ఉండగా.. తాజాగా, ఆ మొత్తాన్ని రూ. 2 లక్షలకు పెంచింది.
వచ్చే ఏడాది (2025) జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆర్బీఐ శనివారం తెలిపింది. కాగా, పంటల సాకుకు రైతులు పెడుతున్న ఖర్చులను, ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిశీలిస్తూ ఆర్బీఐ ఈ పరిమితిని పెంచుతూ వస్తోంది. 2004లో కేవలం రూ. 10 వేలే ఉండగా.. క్రమంగా దాన్ని పెంచుతూ వచ్చింది. తాజాగా, ఈ మొత్తాన్ని రూ. 2 లక్షలకు పెంచింది.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. సాధారణంగా భూ యజమానుల నుంచి ఎలాంటి పూచీకత్తు అడగకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం ఇది అమలు కావడం లేదు. దీంతో ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీతో రుణం తీసుకుని అప్పులపాలవుతున్నారు రైతులు. ఇలాంటి రైతుల కోసమే ఆర్బీఐ ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 2 లక్షల వరకు రుణాలను అందించాలని బ్యాంకులకు స్పష్టం చేసింది.
కాగా, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ భారతదేశ స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీపీలో దాదాపు 18% వాటాను కలిగి ఉంది. దాదాపు సగం జనాభా వ్యవసాయ-ఉత్పన్న ఆదాయంపై ఆధారపడి ఉంది. ఫిబ్రవరి 2019లో, సెంట్రల్ బ్యాంక్ పూచీకత్తు లేని వ్యవసాయ రుణాల పరిమితిని అప్పటికి ఉన్న రూ. 1 లక్ష నుంచి రూ. 1.6 లక్షలకు పెంచింది. ఇప్పుడు రూ. 2 లక్షలకు పెంచింది. వ్యవసాయ పెట్టుబడుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు రుణ సదుపాయాన్ని మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ చర్య ద్వారా చిన్న, సన్నకారు రైతులైన 86 శాతం మందికి ప్రయోజనం చేకూరనుందని తెలిపింది.








