తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్దం అవుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ ఈ మేరకు సీఎం రేవంత్ కు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఖాళీల భర్తీతో పాటుగా ఒక మంత్రికి ఉద్వాసన..శాఖల మార్పు ఖాయమని సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్తున్న రేవంత్..తుది జాబితా పైన చర్చించనున్నారు. అదే విధంగా నామినేటెడ్ పదవుల భర్తీ పైన ఈ పర్యటనలో ఫైనల్ నిర్ణయం జరిగే అవకాశం ఉంది.
ఢిల్లీకి సీఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. (గురువారం) జరగనున్న సీడబ్ల్యుసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ హాజరు కానున్నారు. ఆ తరువాత పార్టీ అధినాయకత్వంతో సమావేశం అవుతారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ పైన తుది చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోకా మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే హైకమాండ్ కు నివేదిక ఇచ్చారు. దీంతో, దీపావళికి ముందే మంత్రివర్గ విస్తరణ ఖాయమని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
సురేఖ పై సీరియస్
రేవంత్ మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఒకరిని తొలిగించటం ఖాయమని తెలుస్తోంది. మంత్రి సురేఖ వ్యవహార శైలి పైన పార్టీ నాయకత్వం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. నాగార్జున కుటుంబం పైన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు..మంత్రిగా ఉంటూ సొంత పార్టీ నేతలతో వైరం.. పోలీసు స్టేషన్ కు వెళ్లటం.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఢిల్లీ దాకా వచ్చి ఫిర్యాదులు చేయటాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతో..సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించటం ఖాయమనే అభిప్రాయం పార్టీ ముఖ్యుల్లో వినిపిస్తోంది. అదే సమయంలో కొత్తగా అయిదుగురికి మంత్రివర్గం లో అవకాశం దక్కటం ఖాయమైనట్లు సమాచారం.
ఛాన్స్ దక్కేదెవరికి
సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అయిదుగురు ఎంపిక పైన రేవంత్ తో భేటీ సమయంలో నిర్ణయం జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సీనియర్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావుతో పాటు, వివేక్, వినోద్ సోదరులు రేసులో ఉన్నారు. వీరిలో వివేక్ కు మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తాజాగా మంత్రి పదవి రేసులో ముందుకు వచ్చారు.
ఆయన సోదరుడు మంత్రిగా ఉండటంతో..రాజగోపాల్ కు ఇప్పడే ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. రంగారెడ్డి నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. ముదిరాజ్ వర్గానికి మంత్రివర్గంలో అవకాశం ఇస్తే మహబూబ్ నగర్ కు చెందిన శ్రీహరి పేరు రేసులో ఉంది. దీంతో, వారం రోజుల్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఖాయమని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో, ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.









