దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ టైటిల్పై వివాదం మొదలైంది. ఇటీవలే ‘గ్లోబ్ ట్రాటర్’ అనే భారీ ఈవెంట్లో ఈ చిత్రానికి ‘వారణాసి’ టైటిల్ను అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ టైటిల్ను తాము ముందుగానే రిజిస్టర్ చేయించుకున్నామని పేర్కొంటూ ఒక చిన్న సినిమా నిర్మాత ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ పతాకంపై సి.హెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాకు తాము ‘వారణాసి’ అనే టైటిల్ను ముందుగానే ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించుకున్నామని ఆ సినిమా నిర్మాత విజయ్ కె. తెలిపారు. తమ వద్ద రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తమ అనుమతి లేకుండా రాజమౌళి వంటి పెద్ద దర్శకుడు తమ టైటిల్ను ఎలా ప్రకటిస్తారని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారు.
వివాదానికి సంబంధించిన ఆధారంగా, ఫిర్యాదుదారులు ఛాంబర్ జారీ చేసిన టైటిల్ రిజిస్ట్రేషన్ పత్రాన్ని కూడా మీడియాకు విడుదల చేశారు. ఈ ఫిర్యాదుతో, రాజమౌళి-మహేశ్ బాబు వంటి అగ్ర కాంబినేషన్ సినిమా ప్రారంభంలోనే టైటిల్ సమస్యను ఎదుర్కొంటోంది. తదుపరి ఈ వివాదంపై ఫిలిం ఛాంబర్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం టాలీవుడ్లో ఉత్కంఠగా మారింది.









