‘దండోరా’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్సింగ్పై శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, మహిళా కమిషన్ మరియు ‘మా’ (MAA) అసోసియేషన్ వరకు వెళ్లాయి. దీనిపై తాజా ప్రెస్ మీట్లో మాట్లాడిన శివాజీ, తాను వాడిన రెండు అసభ్య పదాలకు మాత్రమే క్షమాపణ చెబుతున్నానని, ఆ పదాలు ఎందుకు వాడానో అని తన భార్యకు కూడా ముందే సారీ చెప్పానని తెలిపారు. అయితే, తన స్టేట్మెంట్కు మాత్రం కట్టుబడి ఉంటానని, మహిళలు గౌరవప్రదమైన బట్టలు వేసుకోవాలని చెప్పడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.
ఈ వివాదంలోకి నటి అనసూయ ఎంట్రీ ఇచ్చి, శివాజీలో ఉన్న ఇన్-సెక్యూరిటీ (అభద్రతా భావం) వల్ల ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. దీనిపై శివాజీ స్పందిస్తూ.. “అవును, నేను ఇన్-సెక్యూర్ గానే ఉన్నాను. హీరోయిన్లు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు వారిపై దాడులు జరుగుతాయని, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వారు ఆత్మహత్యలు చేసుకుంటారని నేను భయపడుతున్నాను. నా భయం వారి భద్రత కోసమే” అని వివరణ ఇచ్చారు. తనపై జాలి చూపినందుకు అనసూయకు థ్యాంక్స్ చెబుతూనే, ఆమె విశాల హృదయానికి దండాలు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
శివాజీ చేసిన వ్యాఖ్యలను మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, నటి కరాటే కళ్యాణి వంటి వారు ఆయనకు మద్దతు తెలపడం గమనార్హం. పరిశ్రమలో గుర్తింపు కోసం అర్థనగ్న ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదన్న శివాజీ మాటల్లో వాస్తవం ఉందని ఆమె పేర్కొన్నారు. గత 30 ఏళ్ల సినీ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోలేదని, ఆవేశంలో దొర్లిన మాటలకు ఇప్పటికే పశ్చాత్తాపం వ్యక్తం చేశానని శివాజీ ఈ సందర్భంగా తెలిపారు.









