డైరెక్టర్ బోయపాటి శ్రీను- నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ‘అఖండ 2’ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ‘బజరంగీ భాయిజాన్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చిన్నారి హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో నటిస్తోంది. బాలనటిగా అమోఘమైన నటన కనబరిచిన ఆమె, దాదాపు పదేళ్ల తర్వాత చదువుపై దృష్టి పెట్టి మళ్లీ ఇప్పుడు ‘అఖండ 2’ ద్వారా వెండితెరపై కనిపించబోతోంది. ఈ అవకాశం కోసం ఆమె కథక్ నృత్యంలో శిక్షణ పొందుతూ సరైన అవకాశం కోసం ఎదురుచూసింది.
నందమూరి బాలకృష్ణతో స్క్రీన్ షేరింగ్ అనుభవం గురించి హర్షాలీ మల్హోత్రా మాట్లాడుతూ.. మొదట్లో ఆయనతో నటించాలంటే భయం వేసిందని వెల్లడించింది. అయితే బాలకృష్ణ గారు చాలా కూల్, కేరింగ్ పర్సన్ అని, తనను ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారని ఆమె తెలిపింది. బాలయ్యతో కలిసి నటించడం తన కెరీర్లో ఒక పెద్ద బ్లెస్సింగ్గా భావిస్తున్నానని హర్షాలీ చెప్పింది.
బాలకృష్ణ ఎనర్జీని చూసి తాను ఆశ్చర్యపోయానని హర్షాలీ పేర్కొంది. “ఆయన ఎనర్జీ అన్స్టాపబుల్. అంత చలిలో కూడా ఆయన ఒక్కసారైనా అలసట చూపలేదు. ఆయన్ని చూసి నేనూ యాక్షన్ స్టంట్స్ చేయగలిగాను” అని ఆమె ప్రశంసించింది. ఈ విధంగా ‘అఖండ 2’ సినిమాతో బాలీవుడ్ నుండి టాలీవుడ్కి రీఎంట్రీ ఇస్తున్న హర్షాలీ, బాలకృష్ణతో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించింది.









