నకిలీ విద్యార్హతలతో యూపీఎస్సీని మోసం చేసి, చివరకు సౌకర్యాల కోసం హంగామా చేసి అడ్డంగా బుక్కయిన మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. యూపీఎస్సీని మోసం చేసిన కేసులో విచారణ జరుపుతున్న పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో ముందస్తు బెయిల్ కోసం ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఢిల్లీ హైకోర్టు పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది.
తనకు శారీరక, మానసిక వైకల్యాలు ఉన్నాయనే తప్పుడు ధృవపత్రాల్ని సమర్పించి యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలు రాసిన పూజా ఖేడ్కర్ ఐఏఎస్ గా కూడా ఎంపికైంది. ట్రైనీ ఐఏఎస్ గా మహారాష్ట్రలో విధులు నిర్వరిస్తూ తనకు రెగ్యులర్ ఐఏఎస్ అధికారులతో సమానంగా సౌకర్యాలు కావాలని, ఎర్రబుగ్గ కారు కావాలని డిమాండ్లు చేయడం మొదలుపెట్టింది. చివరకు ఈ హంగామానే ఆమెను పట్టించింది. పూజా ఖేడ్కర్ వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన అధికారులు ఆరా తీస్తే ఆమె బండారం బయటపడింది.
పూజా ఖేడ్కర్ పై యూపీఎస్సీని మోసం చేసిన కేసును నమోదు చేశారు. యూపీఎస్సీ కూడా ఆమె నియామకాన్ని రద్దు చేసింది. భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా నిషేధం కూడా విధించింది. అయితే పోలీసులు విచారణను ముమ్మరం చేయడంతో అరెస్టు తప్పదనే భయంతో ముందస్తు బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఆమె తీరు యూపీఎస్సీని మోసం చేయాలన్న భారీ కుట్రలో భాగంగా కనిపిస్తోందని, ఆమె అపాయింట్ మెంట్ కు అర్హురాలు కాదని వ్యాఖ్యానించింది. ఆమె యూపీఎస్సీనే కాదు దేశాన్నే మోసం చేసిందని వ్యాఖ్యానించింది.









