మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – దర్శకుడు బుచ్చి బాబు సాన కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. తాజాగా విడుదలైన ఓ ప్రత్యేక వీడియో ఇంటర్వ్యూలో రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకోగా… ఇప్పుడు అందరి దృష్టి సినిమాలోని “ఢిల్లీ ఎపిసోడ్” పై పడింది.
సినిమా మొత్తం ఒక లెవల్ అయితే… సెకండ్ హాఫ్లో వచ్చే ఢిల్లీ ఎపిసోడ్ మాత్రం మరో లెవల్లో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడిన రామ్ చరణ్… “సినిమా మొత్తంలో నాకు అత్యంత ఇష్టమైన భాగం ఇదే” అంటూ స్పెషల్గా ప్రస్తావించారు. ఢిల్లీలో షూటింగ్ సమయంలో వాతావరణం తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని… క్లైమేట్ సమస్యలు ఉన్నప్పటికీ టీమ్ మొత్తం ఎంతో డెడికేషన్తో పనిచేసిందని గుర్తుచేసుకున్నారు.
ఇక సినిమాటోగ్రాఫర్ R. రత్నవేలు పనితీరుపై చరణ్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ ఎపిసోడ్లో ఆయన తీసిన వైడ్ ఫ్రేమ్స్, కలర్ టోన్స్ సినిమాకు పూర్తిగా కొత్త ఫీల్ తీసుకొస్తాయని చెప్పారు. విజువల్స్ థియేటర్లలో ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ అనుభూతిని ఇస్తాయని వెల్లడించారు.
ఈ ఎపిసోడ్లోనే సినిమా అసలు ఎమోషన్ ట్రావెల్ అవుతుందని దర్శకుడు బుచ్చిబాబు లీక్ చేశారు. ముఖ్యంగా వ్యవసాయం బ్యాక్డ్రాప్తో వచ్చే భావోద్వేగాలు ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తాయని అన్నారు. అంతేకాదు… ఇదే భాగంలో సినిమాను పూర్తిగా మలుపు తిప్పే “బిగ్గెస్ట్ ట్విస్ట్” కూడా ఉంటుందని రివీల్ చేశారు.
సాధారణంగా స్టార్ హీరో ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని కొంతమంది దర్శకులు అలాంటి రిస్కీ పాయింట్స్ను టచ్ చేయడానికి వెనకడుగు వేస్తారని… కానీ ఈ కథలో ఆ ట్విస్ట్ హీరోయిజాన్ని తగ్గించకుండా, మరో 50 రెట్లు పెంచేలా ఉంటుందని బుచ్చిబాబు కాన్ఫిడెంట్గా చెప్పారు. కథలో ఆ సన్నివేశం సెట్ అయిన విధానం ప్రేక్షకులకు గూస్బంప్స్ ఇస్తుందని తెలిపారు.
ఇక ఈ ట్విస్ట్ సీన్కు A. R. రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రత్నవేలు విజువల్స్, రామ్ చరణ్ నటన కలిసి థియేటర్లలో మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమనే టాక్ ఇప్పటికే మొదలైంది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్తో మరోసారి ఎమోషనల్ మ్యాజిక్ చూపిస్తారేమో చూడాలి!









