నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన కొత్త సినిమాలపై వస్తున్న వదంతులకు ఎండ్ కార్డ్ వేశారు. ప్రస్తుతం తాను ఎలాంటి కొత్త ప్రాజెక్ట్కి ఒప్పుకోలేదని, సమీప భవిష్యత్తులో కొత్త సినిమాలు ప్రారంభించే ఆలోచన కూడా లేదని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది.
‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో—“పవన్ కల్యాణ్ గారు ఇప్పటివరకు కొత్త సినిమా కమిట్మెంట్లు ఏవీ తీసుకోలేదు. ఆయనపై వస్తున్న వార్తలు అసత్యం. సరైన సమయంలో అధికారికంగా అన్ని వివరాలు తెలియజేస్తాం” అని పేర్కొన్నారు. అలాగే ‘ఓజీ’ సీక్వెల్గా ప్రచారం జరుగుతున్న ‘ఓజీ2’పై కూడా తగిన సమయంలో పవన్ కల్యాణ్ స్వయంగా అప్డేట్ ఇస్తారని తెలిపారు.
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా సినిమాలు చేస్తారనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత మోహన్ రాజా, దేవ కట్టా వంటి దర్శకులతో చర్చలు జరుగుతున్నాయనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు టీమ్ ఈ ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది.
ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గతంలో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ పరిస్థితిపై కూడా ప్రస్తుతం స్పష్టత లేదు. మొత్తంగా, పవన్ కల్యాణ్ తన పూర్తి ఫోకస్ను రాజకీయ బాధ్యతలపైనే పెట్టినట్లు ఈ ప్రకటన స్పష్టం చేస్తోంది.









