ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో విపక్షంగా ఉన్న టీడీపీని టార్గెట్ చేసిన వైసీపీ నేతలు, పోలీసు, ఇతర అధికారులే టార్గెట్ గా మంత్రి నారా లోకేష్ సాగిస్తున్న రెడ్ బుక్ పోరాటం మూడో ఛాప్టర్ కు చేరుకోబోతోంది. అప్పట్లో తమను టార్గెట్ చేసి వేధించిన వారిలో చాలా మందిని ఇప్పటికే రెడ్ బుక్ ఛాప్టర్ 1, ఛాప్టర్ 2 లో చుక్కలు చూపిన లోకేష్.. ఇప్పుడు ఛాప్టర్ 3పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అమెరికాలో వెల్లడించారు.
ప్రస్తుతం అమెరికాలో పెట్టుబడుల అన్వేషణలో బిజీగా ఉన్న నారా లోకేష్.. మధ్యలో టీడీపీ ఎన్నారై నేతలతో భేటీ అవుతున్నారు.ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో తన యువగళం పాదయాత్రలో తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన వారిని వదిలిపెట్టేది లేదని తెలిపారు. ఇందుకోసం త్వరలో రెడ్ బుక్ ఛాప్టర్ 3 ఓపెన్ చేస్తామని ప్రకటించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామన్నారు.
గతంలో వైసీపీ పాలనలో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే లుకౌట్ నోటీసులు ఇచ్చే వారని, కానీ నోటీసులకు భయపడకుండా ఎన్నారైలు నిలబడ్డారని లోకేష్ ప్రశంసించారు. ఇప్పుడు వారిని టార్గెట్ చేసిన వారికి రెడ్ బుక్ ఛాప్టర్ 3లో సమాధానం ఇస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. దీంతో అప్పట్లో యువగళం పాదయాత్రతో పాటు సోషల్ మీడియాలో పోస్టులపై చర్యలు తీసుకున్న పోలీసు అధికారులు ఈసారి రెడ్ బుక్ ఛాప్టర్ 3లో ఉండబోతున్నారా అన్న చర్చ జరుగుతోంది. అమెరికా నుంచి లోకేష్ తిరిగి రాగానే రెడ్ బుక్ ఛాప్టర్ 3పై ఫోకస్ పెట్టనున్నారు.









