తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 783 పోస్టులకు.. 5,51,847 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఒక్కో పేపర్లో 150 మార్కుల చొప్పున నాలుగు పేపర్లకు 600 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్ర 5.30 గంటల వరకు రెండో పేపర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. మార్చిలో ఫలితాలు విడుదల కానున్నాయి.
పరీక్షప్రారంభానికి అరగంట ముందే గేట్లు క్లోజ్ చేస్తామనీ టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. కాబట్టి అభ్యర్థులు 9:30 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాలకు అనుమతించమని అధికారులు తెలిపారు. ఇక బయోమెట్రిక్ పద్ధతిలో అభ్యర్థుల అటెండెన్స్ నిర్వహించనున్నారు.
గ్రూప్ -2 పరీక్ష నిర్వహణకు 49,843 మంది విద్యాసంస్థల సిబ్బంది కేటాయించారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది 1,719 మంది ఏర్పాటు చేశారు. ఇక గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎగ్జామ్స్ సెంటర్స్ మొత్తం 6,865 మంది పోలీసులతో భద్రత, సీసీ కెమెరాల నిఘా నీడలో ఉంచారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలలో ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 64,083 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తంగా 173 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.









