తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. యువ దర్శకుడు కిరణ్ కుమార్, సినీ వర్గాల్లో ‘కేకే’ గా పిలవబడే ఆయన బుధవారం ఆకస్మికంగా కన్నుమూశారు. కెరీర్ పరంగా ఎదుగుతున్న సమయంలో ఆయన ఇలా అకస్మాత్తుగా మరణించడం పట్ల చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కేజేక్యూ: కింగ్.. జాకీ.. క్వీన్’ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.
కేకే గతంలో లెజెండరీ దర్శకుడు మణిరత్నం వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. మణిరత్నం తెరకెక్కించిన పలు ప్రతిష్టాత్మక చిత్రాల్లో అసోసియేట్ డైరెక్టర్గా కీలక బాధ్యతలు నిర్వహించి, కథనం మరియు విజువల్ ట్రీట్ విషయంలో ప్రత్యేక శిక్షణ పొందారు. అంతకుముందు ‘కేడీ’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైనప్పటికీ, అది ఆశించిన విజయం సాధించకపోవడంతో కొంతకాలం విరామం తీసుకుని మణిరత్నం స్కూల్లో నైపుణ్యాన్ని పెంచుకున్నారు.
దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ కేకే తన ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల విజయ్ ఆంటోనీ నటించిన ‘భద్రకాళి’ చిత్రంలో ఆయన సీబీఐ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు. శశి ఓదెల, దీక్షిత్ శెట్టి, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో ఆయన రూపొందించిన ‘కేజేక్యూ’ టీజర్కు ఇప్పటికే మంచి స్పందన లభించింది. నటుడిగా, దర్శకుడిగా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్న తరుణంలో ఆయన మరణం తీరని లోటుగా మిగిలిపోయింది.








