ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సోలార్ విద్యుత్ కోసం కేంద్ర ప్రభుత్వ సంస్ధ సెకీతో జగన్ సర్కార్ కుర్చుకున్న ఒప్పందం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనికి కారణం ఈ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ భారీగా ముడుపులు చెల్లించినట్లు అమెరికా కోర్టులో దాఖలైన అభియోగాలే. దీనిపై నిన్న ప్రెస్ మీట్ పెట్టిన జగన్.. ఇంత తక్కువ ధరకు విద్యుత్ వచ్చేలా ఒప్పందం చేసుకున్న తనకు సన్మానం చేసి అవార్డు ఇవ్వాల్సింది పోయి విమర్శిస్తారా అని ప్రశ్నించారు.
దీనిపై ఇవాళ పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. అదానీ దగ్గర గుజరాత్ ప్రభుత్వం యూనిట్ కు రూ 1.99 పైసలకే కొంటే.. అదే కంపెనీ నుంచి 50పైసలు ఎక్కువ పెట్టి అంటే రూ.2.49 పైసలకు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా అని జగన్ ను షర్మిల ప్రశ్నించారు. అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకపోతే ఆగమేఘాల మీద ఒప్పందానికి ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా అని అడిగారు. ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడ ఇక్కడ లేకుంటే గుజరాత్కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి రూ 1.99 పైసలకు అదానీ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.
అదానీతో మీ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా చరిత్ర అని జగన్ ను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు. అదానీ కలవడం ఒక చరిత్ర అని, రూ.1750 కోట్లు నేరుగా సీఎంకే ముడుపులు ఇవ్వడం మరో చరిత్ర అని, ఎవడూ కొనేందుకు ముందుకు రాని విద్యుత్ను బంపర్ ఆఫర్గా ప్రకటించుకోవడం ఇంకో చరిత్ర, గంటల్లోనే క్యాబినెట్ పెట్టడం చరిత్ర, ప్రజాభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చరిత్ర, అదానీ కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం చరిత్ర, ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం ఏపీ రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్ర, ప్రపంచం మొత్తం ఇప్పుడు తమరి అవినీతి గురించి మాట్లాడుకోవడం మీ గొప్ప చరిత్ర అని షర్మిల సెటైర్లు వేశారు.
అదానీతో రహస్య ఒప్పందాలు జరగకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే, మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయాలని షర్మిల సవాల్ విసిరారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లో నాపేరు ఎక్కడుందని బుకాయించే జగన్ .. ఏపీ చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు మీరు కారా అని అడిగారు. ఆ కుర్చీలో మీరు కాకుండా మిమ్నల్ని నడిపించే వాళ్లు కూర్చున్నారా..? ఇదేం ఆఫ్ బేస్ట్ నాలెడ్జ్ అని అడిగారు. జగన్ నటనకు ఆస్కార్ ఇవ్వాల్సిందే అన్నారు.









