కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాది అయిందని.. ఇప్పుడు కుల గణన పేరుతో మరో మోసానికి తెరతీసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హనుమకొండలో నిర్వహించిన బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతివృత్తిదారుల గొంతుకోశారని విమర్శించారు.
వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. కొత్త పథకాలు దేవుడెరుగు. ఉన్న పథకాలకే పాతరేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే రైతుబంధు, దళితబంధు పథకాలు ఆగిపోయాయని కేటీఆర్ అన్నారు. బీసీల ఓట్ల కోసం కులగణన అనే కొత్త నాటకం మొదలుపెట్టారని కేటీఆర్ మండిపడ్డారు.
కులగణనలో 175 ప్రశ్నలు అడుగుతున్నారని కేటీఆర్ తెలిపారు. బ్యాంకుల్లో డబ్బు ఎంత ఉంది? ఇంట్లో ఏసీ ఉందా? ఫ్రిజ్ ఉందా? అని అడుగుతున్నారని పేర్కొన్నారు. దీనిపై కులగణన కోసం వెళ్లిన అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. బీసీల ఓట్ల కోసం అధికారులను బలిపశువులను చేస్తున్నారని మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు కేటీఆర్. బీసీలకు 42 శాతం హామీలు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ ఉండాలని గతంలో కేసీఆర్ కోరారని గుర్తు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ నేతల చిత్తశుద్ధిని ప్రజలు అనుమానిస్తున్నారని తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి కోసమే తెలంగాణలో కులగణన సర్వే చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కులగణన అంటున్నారు కానీ.. బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడటం లేదని మండిపడ్డారు. బీసీ యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు చెప్పారని తెలిపారు. ఒక్క బీసీ బిడ్డకు అయినా రూ.10 లక్షల వడ్డీ లేని రుణం ఇచ్చారా అని ప్రశ్నించారు.









