సూపర్స్టార్ మహేశ్బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక యాక్షన్ అడ్వెంచర్ చిత్రం SSMB29 ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్గా నిలిచింది. ఈ పాన్-వరల్డ్ మూవీ అప్డేట్ల కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, మేకర్స్ సంచలన ప్రకటన చేస్తూ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ‘కుంభ’ అనే క్రూరమైన, శక్తిమంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు.
ఈ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతోంది. పోస్టర్లో పృథ్వీరాజ్ సుకుమారన్ వీల్చైర్లో కూర్చుని, ఆయన వెనుక రోబోటిక్ చేతులు కలిగి ఉండడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఆయన చూపుల్లోని తీవ్రత ఈ పాత్ర స్వభావాన్ని తెలియజేస్తోంది. పృథ్వీరాజ్ నటనను రాజమౌళి ప్రశంసించారు, “నాకు తెలిసిన అత్యుత్తమ నటులలో మీరు ఒకరు” అని పేర్కొన్నారు. ఈ దుష్ట, క్రూరమైన, శక్తిమంతమైన విలన్ కుంభకు ప్రాణం పోయడం సృజనాత్మకంగా తనకెంతో సంతృప్తిగా ఉందని రాజమౌళి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు.
కుంభ లుక్పై స్పందిస్తూ హీరో మహేశ్బాబు ఇచ్చిన క్యాప్షన్ సైతం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. “నేను అవతలి వైపు ఉన్నాను. ఈ కుంభతో నేరుగా కలిసే సమయం ఆసన్నమైంది!” అని మహేశ్బాబు పోస్ట్ చేశారు. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్లు ఈ వారం కొనసాగనున్నాయి. ముఖ్యంగా నవంబర్ 15న ‘గ్లోబ్ ట్రోటర్’ (#GlobeTrotter) ఈవెంట్లో సినిమా టైటిల్, మహేశ్బాబు ఫస్ట్ లుక్ రివీల్ కానున్నట్లు తెలుస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదల కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.








