బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ‘కాంతార’ సినిమాలోని దైవ నృత్యం (దైవం ఆవహించిన) సన్నివేశాన్ని అనుకరించి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. నవంబర్ 30న గోవాలో జరిగిన IFFI (అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) ముగింపు వేడుకలో తన కొత్త చిత్రం ‘దురంధర్’ ప్రమోషన్స్లో భాగంగా ఆయన రిషబ్ శెట్టి నటనను ప్రశంసిస్తూ ఈ సన్నివేశాన్ని అనుకరించారు.
అయితే, రణ్వీర్ బూట్లు ధరించి ఆ పవిత్ర నృత్యాన్ని అనుకరించడం, ఆ దైవాన్ని ‘ఆడ దెయ్యం’ (female ghost) అని సంబోధించడంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో, రణ్వీర్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా క్షమాపణలు తెలియజేస్తూ వెనక్కి తగ్గారు.
తన వల్ల ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నానని రణ్వీర్ పేర్కొన్నారు. రిషబ్ శెట్టి అద్భుతమైన నటనను ప్రశంసించాలన్నదే తన ఉద్దేశమని ఆయన వివరణ ఇచ్చారు. దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయం, నమ్మకాన్ని తాను గౌరవిస్తానని, ఒక నటుడిగా ఆ సన్నివేశంలో నటించడానికి ఎంత కష్టపడతారో తనకు తెలుసని రణ్వీర్ తెలిపారు.









