ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెబుతోంది. సంక్రాంతి పండుగ నుండి మరొక పథకాన్ని అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత ముఖ్యమైన ఉచిత బస్సు ప్రయాణ పథకం పైన ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కీలక ప్రకటన చేశారు.
అప్పటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో ఆయన వెల్లడించారు. సంక్రాంతి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం సంక్రాంతి నుంచి అందుబాటులోకి వస్తుందని ఈ పథకం అమలులో భాగంగా బస్సులకు కొరత లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
ఏపీలో మహిళలకు శుభవార్త
అంతేకాదు ఈ పథకం కారణంగా ఆటో డ్రైవర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా వారిని దృష్టిలో పెట్టుకుని విధివిధానాలను రూపొందించే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందబోతుందని ఆయన చేసిన ప్రకటనతో ఏపీలో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విధి విధానాలపై కసరత్తు చేస్తున్న ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తే నెలకు 250 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.ఈ క్రమంలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఏ సర్వీసులకు వర్తింప చేయాలన్న అంశం పైన కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. అంతేకాదు ఎంత పరిమితి వరకు దీనిని అమలు చేయాలన్న దాని పైన కూడా దృష్టి సారించి పక్కాగా ఈ పథకాన్ని అమలులోకి తీసుకురానుంది.
ఉచిత బస్సు పథకంపై తాజా ప్రకటన కరెక్టేనా?
మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తారని మొదట ప్రచారం జరిగింది. ఆ తర్వాత దీపావళి నుంచి ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు మళ్లీ సంక్రాంతి నుంచి ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతుంది. మరి సంక్రాంతి నుంచైనా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.









