ఏపీలో రేషన్ కార్డుకు అర్హులైన వారికి ప్రభుత్వం ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కావస్తున్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కోసం ప్రభుత్వం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, కార్డుల మంజూరు చేయబోతున్నారు.
కూటమి ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇలా డిసెంబర్ 28 వరకూ అప్లికేషన్స్ స్వీకరణ ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల విభజన, మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పిస్తారు. అనంతరం సంక్రాంతిలోపు కొత్త రేషన్ కార్డులకు అర్హుల గుర్తింపు పూర్తి చేస్తారు.అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని భావిస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కార్డులు మంజూరు చేశారు. అయితే ప్రభుత్వం మారాక వీటికి బ్రేక పడింది. ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాలతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పెళ్లైన కొత్త జంటలు, కుటుంబ సభ్యుల జాబితాలో మార్పులు చేర్పులు చేయాల్సినవారు, ఇంకా అర్హత గల ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా తెల్ల రేషన్ కార్డులు పొందారు. వీటిని రద్దు చేస్తూ, కొత్త కార్డుల జారీకి సిద్దమవుతున్నారు.








