పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఇరువురి తరఫు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. వీరంతా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ చేరారు. వారు హస్తం పార్టీలో చేరడంపై పలువురు బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకించారు.
వారి అనర్హత వేటు వేసేలా స్పీకర్ ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు షెడ్యూల్ ఖరారు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ కు వెళ్లారు. కోర్టులకు స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసే అధికారం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం ఇరు వర్గాల వాదనలు విన్నది. తీర్పు రిజర్వ్ చేసింది.
కోర్టు తీర్పు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వస్తే వారంతా సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ ముగ్గురే కాకుండా చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ హస్తం గూటికి చేరారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోర్టు తీర్పు ఇస్తే వీరంతా అయోమయంలో పడే అవకాశం ఉంది. ఒక వేళ వీరికి అనుకూలంగా తీర్పు వస్తే మరికొంత మంది బీఆర్ఎస్ పార్టీని వీడే అవకాశం ఉంది. ప్రస్తుతం హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ నేతలే పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు వెళ్లడం ఏమిటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీలో చేరడం సరైంది కాదని ప్రజాస్వామ్య వాదులు చెబుతున్నారు. ఈ పనులు బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఏ పార్టీ చేసినా తప్పేనని వివరిస్తున్నారు. అయినప్పటికీ పార్టీలు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు.








