నటి జాన్వీ కపూర్, సోషల్ మీడియాలో పెరుగుతున్న అనారోగ్యకర ధోరణులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీల మరణాలను సరదా మీమ్స్గా మార్చడంపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ, ఇది మనుషుల్లో నైతిక విలువలను నశింపజేస్తుందని అన్నారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ, ఈ మధ్య కాలంలో ప్రజలు చూపుతున్న అసహజమైన స్పందనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
తన తల్లి, దివంగత నటి శ్రీదేవి మరణం గురించి మాట్లాడాలంటే తనకు ఎప్పుడూ భయం ఉండేదని జాన్వీ తెలిపారు. “అమ్మ గురించి చెప్పిన ప్రతిసారి, నేను దాన్ని ప్రచారం కోసం వాడుతున్నానని అనుకునేవాళ్లు ఉన్నారేమోనన్న ఆలోచన నన్ను మరింత ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేసేది. ఆమెను కోల్పోయిన దుఃఖం ఇంకా మనసులో గాఢంగా ఉంది” అని ఆమె ఎమోషనల్గా పంచుకున్నారు.
జర్నలిజం, సోషల్ మీడియా ఇప్పుడు సున్నితమైన విషయాలపై కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయనే అభిప్రాయాన్ని జాన్వీ వ్యక్తం చేశారు. ఇటీవల ధర్మేంద్ర జీవించి ఉన్నప్పటికీ ఆయన మరణం గురించి అబద్ధపు పోస్టులు వైరల్ చేయడం, వాటిని మీమ్స్గా మార్చడం చూసి నిరాశకు గురయ్యానని తెలిపారు. 2018లో శ్రీదేవి అనుకోకుండా మరణించిన తర్వాత కూడా సోషల్ మీడియా కామెంట్లు, మీమ్స్ తమ కుటుంబం అనుభవించిన బాధను మరింత పెంచాయని ఆమె గుర్తుచేసుకున్నారు.









