తెలంగాణలో మండలి ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ల స్థానాలకు ఎంపిక షురూ అయ్యింది. కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి సీనియర్ నేత జీవన్రెడ్డికే ఛాన్స్ ఇవ్వాలని తీర్మానం చేసింది టీపీసీసీ.
వచ్చే ఏడాది శాసనమండలిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఒకటి గ్రాడ్యుయేట్ కాగా, మరో రెండు టీచర్ల స్థానాలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా మరోసారి సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేరును ఖరారు చేయాలని కాంగ్రెస్ ముఖ్యనేతలు పార్టీ హైకమాండ్ను కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
గురువారం గాంధీభవన్లో జరిగిన సమావేశానికి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సహా సీనియర్ నాయకులు హాజరయ్యారు. పీసీసీ అధ్యక్షుడు ముఖేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, పలువురు మంత్రులు హాజరయ్యారు.
జీవన్ రెడ్డి పోటీకి రెడీగా ఉంటే ఆయన పేరు హైకమాండ్ కు పంపిస్తామన్నారు అధ్యక్షుడు ముఖేష్ కుమార్. ఒకవేళ ఆయన పోటీకి ఆసక్తి చూపకుంటే మరో అభ్యర్థి ఎంపిక కోసం ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. అప్పుడు సీనియర్ మంత్రులతో కలిసి ఓ కమిటీ వేస్తామన్నారు.
ఈలోగా సాధ్యమైనంత ఎక్కువమంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించేలా ఆ జిల్లాల ఇన్ ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. జీవన్రెడ్డి 2018లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది మార్చితో ఆయన పదవీకాలం ముగియనుంది.
ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం 42 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు సమన్వయంతో పని చేయాలని ఆదేశించింది టీపీసీసీ.








