సైబర్ నేరాలు ఇప్పుడు పోలీస్ వ్యవస్థకు పెద్ద సవాల్ ను విసురుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సైబర్ ఫ్రాడ్స్ పెరిగిపోయాయి. సైబర్ మోసగాళ్లు ఎప్పుడు ఏ విధంగా ఎవరిని మోసం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు మోసం చేయడంలో అప్డేట్ అవుతూ వస్తున్న సైబర్ నేరగాళ్లు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు.
కుటుంబ సర్వే లింక్స్ పేరుతో ఫ్రాడ్
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతుంది. ఇక దీనిని కూడా వదిలిపెట్టకుండా సైబర్ నేరానికి తెర తీశారు సైబర్ నేరగాళ్లు. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఒక ఫ్రాడ్ లింకును సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే లింక్ పేరుతో ఓ లింక్ ని పెట్టి అందులో డేటా ఇస్తే సరిపోతుందని లింక్స్ పంపుతున్నారు.
ఆన్ లైన్ లో సమగ్ర కుటుంబ సర్వే జరగదు
ఇక పొరపాటున ఎవరైనా ఆ లింకు క్లిక్ చేస్తే మీ అకౌంట్స్ సైబర్ నేరగాళ్లు ఖాళీ చేస్తారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ ఫోర్స్ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఎటువంటి లింకులు తయారు చేయలేదని ఆన్లైన్లో ఈ సర్వే జరగదని ప్రజలకు చెబుతున్నారు.
లింక్స్ ఓపెన్ చెయ్యొద్దు, కాల్స్ తో జాగ్రత్త
సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా అధికారులే నేరుగా ఇంటికి వచ్చి సర్వే చేస్తారని, లింక్స్ పంపించి అందులో డేటా నమోదు చేయమని ప్రభుత్వం అడగదని సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. పొరపాటున కూడా ఎవరూ సమగ్ర కుటుంబ సర్వే పేరుతో పంపించే లింకులను ఓపెన్ చేయొద్దని అధికారులు చెబుతున్నారు. ఇక సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఎటువంటి ఫోన్ కాల్స్ రావని ఎటువంటి ఓటీపీలు అడగరని అంటున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఒకవేళ ఎవరైనా అలా చేస్తే పొరపాటున కూడా ఓటీపీలు చెప్పొద్దని హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరాలను కట్టడి చేయడం లో తమ బాధ్యత ఎంత ఉందో అప్రమత్తంగా వ్యవహరించడంలో ప్రజల బాధ్యత కూడా అంతే ఉంటుందని చెబుతున్నారు. సైబర్ నేరాల కట్టడిలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.








